కలెక్టర్‌ను కలిసిన గంగవ్వ.. మా ఊరికి ఐకేపీ సెంటర్ కావాలంటూ వినతి!

‘మై విలేజ్ షో’ ద్వారా సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగిన గంగవ్వ, సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో సందడి చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్‌ను కలిసి తన గ్రామానికి సంబంధించిన సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

వడ్ల కొనుగోలుతో ఇబ్బందులు: మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం (IKP సెంటర్) లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గంగవ్వ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం ఆరపోసుకోవడానికి సరైన స్థలం లేక, పక్కనే ఉన్న గుట్ట భూమిని ఉపయోగిస్తున్నామని.. దీనివల్ల పక్క గ్రామం వారితో భూమి విషయంలో తగాదాలు తలెత్తుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గంగవ్వ విజ్ఞప్తి: “మా ఊరి రైతులకు వడ్లు అమ్ముకోవాలంటే చాలా కష్టమైతంది. పక్క ఊరి వాళ్లతో గొడవలు అవుతున్నాయి. మా ఊరికి ప్రత్యేకంగా ఐకేపీ సెంటర్ మంజూరు చేసి, స్థలం కేటాయిస్తే రైతులందరికీ మేలు జరుగుతుంది” అని గంగవ్వ కలెక్టర్‌కు వివరించారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గంగవ్వ వెంట గ్రామానికి చెందిన పలువురు రైతులు కూడా ఉన్నారు.